40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం

  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
  • అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం
  • ప్రజల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
  • వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని దిశానిర్దేశం
సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే బృందంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, ప్రభుత్వ ప్రాధాన్యతలను, పనితీరును సీఎం వారికి వివరించారు.

ఈ సందర్భంగా క్షేత్రస్థాయి ఉద్యోగులు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పించారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి గృహ నిర్మాణ పథకంపై కొన్ని విలువైన సూచనలు చేయగా, సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. "మీరు మంచి సూచన చేశారు, తప్పకుండా అమలు చేస్తాం" అని ఆ ఉద్యోగికి హామీ ఇచ్చారు. సీఎంతో మాట్లాడే అవకాశం లభించడంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సంతృప్తికర సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారని సీఎం అభినందించారు.

"విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నాం. అందరి సమష్టి కృషితోనే మనకు 'బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కింది. ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతీ ఒక్కరి సహకారంతో వ్యవస్థలు మెరుగుపడ్డాయి" అని చంద్రబాబు అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పది సూత్రాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గడిచిన 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, తద్వారా 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయని వివరించారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, ఆమ్కా (ఏఎంసీఏ) వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, త్వరలోనే బీపీసీఎల్ వంటి మరో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆమ్కా ప్రాజెక్టుతో పుట్టపర్తి-బెంగళూరు మధ్య ఏరో స్పేస్ సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆర్థికేతర సమస్యలను 100 శాతం పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. "ప్రభుత్వ పాలనలో వేగం పెరగాలి. ఆమ్కా ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి శంకుస్థాపన చేశాం. ఈ వేగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలనలో ఎక్కడా అవినీతి కనిపించకూడదు, పూర్తి పారదర్శకతతో పనిచేయాలి. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా మన పనితీరే బ్రాండ్‌గా మారాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, చిన్న సమస్య అయినా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Chandrababu Naidu
Andhra Pradesh
teleconference
government employees
governance
development
investments
AMCA project
BPCL
Swarnandhra

More Telugu News